[విరూపుడి సహాయం వల్ల, ధూమకుడు గరుడపక్షి బారి నుంచి బతికి బయటపడ్డాడు. తరవాత వాళ్ళకు అరణ్యంలో వికృతాకారుడొకడు కనిపించాడు. అతడు చెప్పిన దారి వెంట కొంత దూరం వెళ్ళి, ధూమకుడూ అతడి మిత్రులూ నదిలో పడవనూ, దాని చుట్టూ ఈదులాడే మొసళ్ళనూ చూశారు. సోమకుడు బాణంతో ఒక మొసలిని కొట్టాడు. -తరవాత]
సోమకుడి బాణందెబ్బ తగిలిన మొసలి కీచుమని అరుస్తూ, నీళ్ళల్లో విలవిలా తన్నుకోసాగింది. ఆ తన్నుకోవటంలో పైన ధరించిన మొసలిచర్మపు తొడుగు పోయి ఒక మానవాకారం బయట పడింది. అప్పటి వరకూ పడవ చుట్టూ ఈదుతున్న మొసళ్ళన్నీ ఒక్కసారిగా తమ పైతొడుగులను తొలగించివేసి, కేకలు పెడుతూ ఒడ్డుకు ఈదుకు రాసాగినై. అవి మొసళ్ళు కావు; మొసళ్ళ లాగా వేషాలు ధరించిన దృఢకాయులైన మనుషులు!
సోమకుడు ఆ వింత చూసి ఆశ్యర్యపోతూ, ‘‘విరూపా, ఇది ఆశ్చర్యంగా లేదా? ఎవరీ మొసలి వేషాల మనుషులు? అసలు ఎవరిదీ పడవ?’’ అన్నాడు. ధూమకుడు అతణ్ణి మెల్లగా మాట్లాడమని హెచ్చరించి, ‘‘చనిపోయే ముందు ఆ వికృతాకారుడు చెప్పిన మాటలు అప్పుడే మరిచిపోయావా? వీళ్ళు కాలకలి రాక్షసుడి బంట్లు. పడవ దగ్గిరకెవరూ రాకుండా వుండేందుకు వాళ్ళు మొసళ్ళలా కపట నాటకం ఆడుతున్నారు. వాళ్ళల్లో ఒకడి తల చితికేలా కొట్టి మనం చిక్కులో పడబోతున్నాం. చూడు, వాళ్ళంతా ఒడ్డెక్కి మనం వున్న చెట్ల కేసే పరీక్షగా చూస్తున్నారు,’’ అన్నాడు. |