ఇప్పటికైనా మించిపోయింది లేదు. రాముడితో వైరం మాను. శరణు వేడు. వానరమూకతో రాముడేం చేయగలడన్న ధీమాతో వుండకు. వానరులెంతటి వారో నీకు మళ్ళీ చెప్పనవసరం లేదు!’’ అన్నాడు.
రావణుడికి కోపం వచ్చి కత్తి ఎత్తాడు. అంగదుడు రావణుడి కిరీటాన్ని కాలితో తన్ని పడద్రోసి, తిరిగి వానరసైన్యం వున్న చోటుకు ఎగిరి వెళ్ళాడు. వానరసేన విజృంభించి లంకా నగరాన్ని ముట్టడించి చికాకు పరుస్తూంటే, రావణుడు కుంభకర్ణుడి నిద్ర చెడగొట్టించి, అతణ్ణి వెంటనే యుద్ధానికి వెళ్ళమన్నాడు.
కుంభకర్ణుడు ఘోరమైన తపస్సు చేసినప్పుడు బ్రహ్మ సరస్వతి చేత అతని కోరికలు తారుమారు చేయించాడు. ఆరు నెలలు తిండి, ఒకరోజు నిద్ర కోరుకోవాలనుకున్న కుంభకర్ణుడు, ఆరు నెలల నిద్ర, ఒకరోజు తిండి కోరుకున్నాడు. బ్రహ్మ అతడికి అలాగే వరమిచ్చాడు. ఆరు నెలల నిద్ర పూర్తిగా తీరకపోతే, కుంభకర్ణుడి శక్తి తగ్గిపోతుంది. అతడు రావణుడు చేసిన పనికి విసుక్కున్నాడు, అన్నకు వినయంగా హితబోధ కూడాచేశాడు. రావణుడు, ‘‘చేస్తే యుద్ధం చెయ్యి, లేదా వెళ్ళి పడుకో!’’ అన్నాడు.
నిద్ర చెడిన కోపంతో కుంభకర్ణుడు వానరులను పట్టుకు తినసాగాడు. రామలక్ష్మణులు నిర్విరామంగా యుద్ధం చేశారు. ఆ
యుద్ధంలో రాముడు కుంభకర్ణుడిని సంహరించాడు. ఆ తరవాత యోధానుయోధులైన రాక్షస ప్రముఖులందరూ కూలిపోయారు. రావణుడి పెద్దకొడుకు ఇంద్రజిత్తు యుద్ధానికొచ్చాడు.
రావణుడు అతని మీద పెద్ద ఆశ పెట్టుకొని ఉన్నాడు. మేఘాల్లోంచి యుద్ధం చేసే వాడవడంవల్ల మేఘనాథుడు అని పేరొంది, ఇంద్రుణ్ణి జయించి కట్టి తెచ్చి, ఇంద్రజిత్తు అనిపించుకొన్న మహావీరుడు. మంత్రతంత్రాలు నేర్చిన ఇంద్రజిత్తు జిత్తులమారి, మహామాయావి. పధ్నాలుగేళ్ళు బ్రహ్మచర్యంతో నిద్రాహారాలు లేకుండా కఠోరదీక్ష గడిపిన వాడివల్లనే గాని, మరెవ్వరివల్లా అతనికి ప్రాణభయం లేదు.
|